దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 75 నగరాల్లో యోగా వేడుకలు జరుగుతుండగా.. కర్నాటక మైసూరులో యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రసంగిస్తూ 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మైసూర్ అధ్యాత్మికానికి కేంద్రం. ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాల్లో మాత్రమే యోగా చేసేవాళ్లు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యోగా చేస్తున్నారు అని పేర్కొన్నారు. నేడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో యోగా సాధన జరుగుతోంది. యోగా మనకు శాంతిని కలిగిస్తుంది. యోగా వల్ల కలిగే శాంతి వ్యక్తులకు మాత్రమే కాదు, మన దేశాలకు, ప్రపంచానికి శాంతిని తెస్తుంది. అంతర్గత శాంతితో కోట్ల మంది ప్రజలు ప్రపంచ శాంతి వాతావరణాన్ని సృష్టిస్తారు. ఆ విధంగా యోగా ప్రజలను, దేశాలను కలుపుతుంది. ఇలా.. యోగా మనందరికీ సమస్య పరిష్కారానికి దారి తీస్తుంది అని ప్రధాని పేర్కొన్నారు.
‘యోగా ఫర్ హ్యుమానిటీ’ నినాదంతో ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకలు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పాల్గొని, యోగా ఆసనాలు వేశారు. దేశ రాజధాని దిల్లీ త్యాగరాజ స్టేడియంలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉత్తర్ప్రదేశ్ నోయిడాలో బీజేపీ అధ్యక్షుడు జేపీనడ్డా, రిషికేశ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రులు పాల్గొన్నారు.