సామాజిక మాధ్యమ దిగ్గజ కంపెనీగా పేరొందిన ఫేస్బుక్ త్వరలోనే తన పేరు మార్చుకోనుందట. ఈ కంపెనీని కొత్త పేరుతో రీబ్రాండ్ చేయాలని ఫేస్బుక్ యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలిసింది. అక్టోబరు 28న జరిగే కంపెనీ వార్షిక సదస్సులో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ పేరు మార్పు గురించి మాట్లాడే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే అంతకంటే ముందే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు పేర్కొంది. పేస్బుక్ వ్యాపార కార్యాకలాపాలపై అమెరికా ప్రభుత్వం నుంచి న్యాయపరమైన ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీ పేరు మార్పుపై వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివాదాలు ఎదురైనప్పుడల్లా ఫేస్బుక్ తన పేరు తరచూ వార్తల్లో రావడంతో అది యూజర్ల సంఖ్యపై విపరీతంగా ప్రభావం చూపిస్తోందని కంపెనీ విశ్వసిస్తోంది. దీంతో కంపెనీకి కొత్త పేరు పెట్టి కొంత ఉపశమనం పొందాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.














