అమెరికా తెలుగు సంఘం(ఆటా) జులై 31, ఆగష్టు 1,2 తేదీల్లో మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్లో నిర్వహించనున్న 19వ ఆటామహాసభల సన్నాహక సమావేశాన్ని ఇటీవల వర్జీనియాలోని హెర్నడన్లో నిర్వహించారు. అమెరికా నలుమూలల నుండి సుమారు 700మంది పాల్గొన్న ఈ సమావేశంలో అధ్యక్షుడు జయంత్ చల్లా సభల విజయవంతానికి అనుసరించవల్సిన ప్రణాళికలపై ప్రసంగించారు.రాజకీయ, కళా, సాహితీ, , వైద్య, వ్యాపార రంగాలకు చెందిన సదస్సులు, అతిథులు ఈ సభాల్లో పాల్గొంటారని తెలిపారు. అమెరికావ్యాప్తంగా 25కు పైగా నగరాల్లో ఆటా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను విశ్లేషించారు.


స్థానిక ప్రవాసుల అసోసియేషన్ లతో సమన్వయం కావడం, వనరులను సమృద్ధిగా వినియోగించుకోవడం వంటి వాటిపై చర్చించారు. పలువురు ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సభల నిర్వహణకు వచ్చే ప్రతి డాలరును పారదర్శకంగా ఖర్చు చేస్తామని ఆటా కార్యవర్గం పేర్కొంది. ఆటా సభల కన్వీనర్ బాణాల శ్రీధర్ మాట్లాడుతూ సభల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికావ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో అతిథులుగా పాల్గొంటారని వెల్లడించారు. రవి చల్లా, వేముల శరత్, దమిడి సుధీర్, జీనత్ కుందూర్, సామ కౌశిక్, మునుకుంట్ల తిరుమల్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.






















