సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్ఎస్ రాజమౌళి వారణాసి చిత్రం నుంచి రెండు ప్రత్యేకమైన స్టిల్స్ను మహేశ్బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ స్టిల్స్లో మహేశ్ రుద్ర గా నేచురల్ లుక్లో తొలిసారి ప్రపంచానికి కనిపించారు. పాలసంద్రంలో శేషపాన్పుపై సేదతీరే శ్రీమహావిష్ణువులా దట్టమైన అడవి మధ్యలో ఒక వెదురు తెప్పపై విశ్రాంతి తీసుకుంటున్న రుద్రను ఓ స్టిల్లో చూడొచ్చు. కెన్యాలోని మసాయి మారా మైదానంలో జిరాఫీలు, క్రూరమృగాల మధ్య నిలబడి, వెనక్కి చూస్తున్న రుద్రను మరొక స్టిల్లో చూడొచ్చు. రుద్ర పాత్ర తీరుతెన్నుల్ని ఆవిష్కరించేలా ఈ రెండు స్టిల్స్ కనిపిస్తున్నాయి. వారణాసి సినిమా సోల్ని కూడా సూచాయగా ఈ స్టిల్స్ చెబుతున్నాయి. కాలాన్ని దాటి ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఓ వ్యక్తి ప్రయాణమే ఈ సినిమా అని మేకర్స్ చెబుతున్నారు.

ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, నిర్మాణం: శ్రీదుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్.





























