ఇరాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా ఆయుధ నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయన్న మీడియా కథనాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు తీవ్ర అసహనాన్ని కలిగించాయి. ఈ సమాచారం బయటకు రావడంతో అమెరికా బలహీనంగా కనిపిస్తోందనీ, అది ఇరాన్తో జరుగుతున్న చర్చల్లో తమ బేరసారాల శక్తిని దెబ్బతీస్తోందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్టు అమెరికా ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ సమాచారాన్ని లీక్ చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన న్యాయశాఖను ఆదేశించారు.

ఇటీవల క్యాంప్ డేవిడ్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం ప్రధాన చర్చగా మారింది. క్షిపణుల నిల్వలు తగ్గుతున్నాయన్న వార్తలపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమావేశానికి హాజరైన అధికారులు తెలిపారు. ఆయుధ నిల్వల పరిస్థితి గురించి తనకు ముందే తెలుసనీ, అయితే ఈ సమాచారం ఇరాన్తో చర్చలు కీలక దశకు చేరుకున్న సమయంలో బయటకు రావడమే తన ఆగ్రహానికి కారణమని ట్రంప్ పేర్కొన్నట్టు వెల్లడించారు. ఈ కథనాలపై ట్రంప్ స్పందిస్తూ అమెరికా వద్ద భారీ స్థాయిలో ఆయుధ నిల్వలు ఉన్నాయనీ, అవసరమైన ఆయుధాలను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నామని వివరించడం గమనార్హం.





























