అమెరికా ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి యూఎస్ ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వీసా, గ్రీన్కార్డ్ లేదా ఇతర ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం దాఖలు చేసిన దరఖాస్తులు అసంపూర్తిగా ఉంటే, మిస్సయిన పత్రాలను సమర్పించమని దరఖాస్తుదారులను మళ్లీ అడగకుండా నేరుగా తిరస్కరించే అధికారాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులకు కల్పించింది. ఈ నిర్ణయం వేలాదిమంది భారతీయ దరఖాస్తుదారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నది. యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) జారీ చేసిన ఈ కొత్త మార్గదర్శకాలు ఆగస్టు 5 నుంచి లేదా ఆ తర్వాత దాఖలైన/పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటికీ తక్షణమే వర్తిస్తాయి.

గతంలో, బైడెన్ పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం దరఖాస్తును తిరస్కరించే ముందు అధికారులు రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్(ఆర్ఎఫ్ఈ) లేదా నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై(ఎన్వోఐడీ) జారీ చేయాలని సూచించేవారు. దీనివల్ల లోపాలను సరిదిద్దుకోవడానికి దరఖాస్తుదారులకు ఒక అవకాశం లభించేది. అయితే ఇకపై ఆ అవకాశం ఉంటుందనే గ్యారెంటీ లేదు. ప్రతి ఇమ్మిగ్రేషన్ ప్రయోజనానికి ఏయే డాక్యుమెంట్లు కావాలో దరఖాస్తు ఫారమ్, అధికారిక మార్గదర్శకాల్లోనే స్పష్టంగా పేర్కొనబడి ఉంటాయి. కాబట్టి దరఖాస్తుదారులు మొదటి నుంచే పూర్తి సమాచారంతో కూడిన దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.





























