Skip to main content

Namaste NRI

స్ఫూర్తిమంతంగా సింగపూర్ తెలుగు సమాజం రక్తదాన కార్యక్రమం

22 జూన్ 2024 న సింగపూర్ లోని శ్రీ సెంపగ వినాయక దేవాలయ ప్రాంగణం @ 19, సిలోన్ రోడ్ సింగపూర్ తెలుగు సమాజం, శ్రీ సత్యసాయి గ్లోబల్ ఆర్గనైజేషన్ సింగపూర్, శ్రీ సెంపగ వినాయగర్ టెంపుల్, సింగపూర్ సిలోన్ తమిళ్ అసోసియేషన్ మరియు మునీశ్వరన్ కమ్యూనిటీ సర్వీసెస్ సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగపూర్లోని తెలుగు,తమిళం,కన్నడ,మలయాళం,హిందీ మరియు స్ధానిక ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 120 మంది దాతలు రక్తదానం చేశారు.

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి దాతలను అభినందించారు. రక్తదానం గురించి అందరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. అందరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సింగపూర్ తెలుగు సమాజం ఇలాంటి రక్తదాన శిబిరాలను అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తోందన్నారు. అయితే సాటి ఇతర భారతీయ మూలాలు కలిగిన స్థానిక సింగపూర్ భారతీయులతో కలిసి నిర్వహించడం విశేషం.

ప్రత్యేకించి కొవిడ్-19 మహమ్మారి సమయంలో 9 సార్లు రక్తదాన శిబిరాలని నిర్వహించి తెలుగు సమాజం రికార్డు సృష్టించింది.
రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు పాలెపు మల్లిక్ గుర్తు చేశారు. ఈ శిబిరానికి వైదా మహేష్, రాపేటి జనార్ధన రావు , జ్యోతీశ్వర్ రెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
దాతలు, పరిశీలకులు, సేవాదళం సభ్యులకు సింగపూర్ తెలుగు సమాజం ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమష్టి కృషితోనే కార్యక్రమం విజయవంతమైనదన్నారు.

Social Share Spread Message

Latest News