నీలకంఠ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం సర్కిల్. సాయిరోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించారు. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. హైదరాబాద్లో ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ నా సినిమాల్లో నాయికల పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో కూడా అదే పంథాను కొనసాగించాను. స్వతంత్య్ర భావాలు కలిగిన యువతిగా రిచాపనై, ధైర్యసాహసాలు మూర్తీభవించిన రాజకుమారి పాత్రలో అర్షిణ్ మెహతా ఆకట్టుకుంటారు. జీవితమే ఓ సర్కిల్ అనే ఫిలాసఫీని చెబుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అన్నారు.

హీరో సాయి రోనక్ మాట్లాడుతూ దర్శకుడు నీలకంఠతో పనిచేయడం గొప్ప అనుభవాన్నిచ్చింది. ఆయనతో వర్క్ చేయడం ఒక ఛాలెంజ్. నా యాంటీ హీరో బాబా భాస్కర్. నిజానికి ఈ చిత్రంలో నాతో పాటు తను కూడా ఒక హీరోనే అని తెలిపారు. సినిమాలో అరుంధతిగా తన పాత్ర భిన్న కోణాల్లో సాగుతుందని రిచా పనై చెప్పింది. తెలుగు తెరపై ఇప్పటివరకు రానటువంటి విభిన్నమైన కథ ఇదని నిర్మాత శరత్ చంద్ర పేర్కొన్నారు. ఈ చిత్రం జూలై 7న విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో శరత్ చంద్ర, బాబా భాస్కర్, రిచా పనై, అర్షిణ్ మెహతా పాల్గొన్నారు.

