అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని వర్జీనియాలో మినీ మహానాడు ను ఘనంగా నిర్వహించారు. తెలుగు సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నందమూరి తారక రామారావు 102వ జయంతి, సినీ వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొనగా, భానుప్రకాశ్ మాగులూరి సమన్వయకర్తగా వ్యవహరించారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు పార్టీ బాధ్యతలు పూర్తిస్థాయిలో అప్పగించాలని ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు తీర్మానం చేశారు. ఎన్టీఆర్పై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా మన్నవ మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. తెలుగు జాతి ఉన్నంతకాలం చరిత్ర పుటల్లో, జన హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయులే. ఆయన కీర్తి అజరామరం. తెలుగు దేశం ఒక ప్రయోగశాల. నాయకులను, కార్యకర్తలను తయారుచేసే కార్ఖానా. పార్టీలో కోటి మంది సభ్యులను చేర్చడం ద్వారా లోకేష్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. అటు పార్టీపై, ఇటు ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వాన్ని పుణికిపుచ్చుకుని లోకేష్ అందనంత ఎత్తుకు ఎదిగారు. ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు ఇదే సరైన సమయం అని తెలిపారు.


భాను మాగులూరి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పార్టీని తీర్చిదిద్దిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు చంద్రబాబు, లోకేష్ దార్శనిక నాయకత్వంలో ప్రపంచ సాంకేతిక రంగ వేదికపై తెలుగు యువతకు శాశ్వత వారసత్వాన్ని అందించారన్నారు. రాజకీయ, వైద్య, ఉద్యోగ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ప్రసంగించారు. భాను మాగులూరిని ఈ సందర్భంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మేరీల్యాండ్ పార్టీ ప్రతినిధి రాజా రావులపల్లి, కిషొర్ కంచెర్ల , రమేష్ అవిరినేని, చక్రవర్తి, సీతారామారావు, రఘు, హనుమంతరావు, డాక్టర్ కేవి రావు, విజయ భాస్కర్, రామకృష్ణ రెడ్డి, చంద్రనాథ్, రమేష్, లోకేంద్ర ప్రసాద్, యాదగిరి, చిట్టెల సుబ్బారావు, సత్తిబాబు, సుబ్రహ్మణ్యం, మాల్యాద్రి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
