నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన అఖండ 2 : తాండవం. తాజాగా విడుదలైన టీజర్, ట్రైలర్లు సోషల్ మీడియాలో రికార్డులు తిరగరాయడంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అఘోర అవతారంలో బాలయ్య చూపించిన ఉగ్రం, తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, బోయపాటి స్టయిలిష్ ఎలివేషన్స్ ఈ సినిమాను భారీ మాస్ ఎంటర్టైనర్గా నిలబెట్టనున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.డిసెంబర్ 5న పాన్ ఇండియా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ప్రమోషన్లు అన్ని రాష్ట్రాల్లో దూకుడుగా జరుగుతున్నాయి. ముంబయి, విశాఖలో పాటల లాంచ్ చేయగా, హైదరాబాద్లో ప్రత్యేక ఈవెంట్, కర్ణాటకలో ట్రైలర్ లాంచ్ తదితర ప్రోగ్రామ్లతో మొత్తం దేశాన్ని కవర్ చేస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఉత్తరాది మీడియా ఇంటరాక్షన్స్ కూడా ప్లాన్ చేశారు.భక్తి, ధర్మం, ఆధ్యాత్మికత- ఇవే సినిమాకు కోర్గా ఉన్న అంశాలుగా ప్రచారాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది.ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను మర్యాదపూర్వకంగా కలిసి అఖండ 2 కథ, నేపథ్యం గురించి వివరించింది. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను యోగికి ప్రత్యేకంగా చూపించగా, భక్తి–ధర్మం–శక్తి తత్త్వాలపై ఆధారపడిన కథకు యోగి ఆదిత్యనాథ్ ఆసక్తి చూపినట్టు సమాచారం. అనంతరం బాలయ్య సినిమాలో చేతబట్టిన త్రిశూలాన్ని స్మారకంగా యోగికి అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
















