బోలేనాథుడి దర్శనం కోసం అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఇద్దరు అమెరికన్లు కూడా ఆ యాత్రలో పాల్గొన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి తరలివచ్చిన ఇద్దరు అమెరికన్లు అమర్నాథ్ యాత్రకు వచ్చి శివుడిని దర్శించుకున్నారు. వీరిరువురు శివభక్తులు. దక్షిణ హిమాలయాల్లోని పవిత్ర గుహలో వెలిసిన మంచులింగాన్ని సందర్శించుకున్న తొలి విదేశీయులు వీరే అని భావిస్తున్నారు. అమెరికాకు చెందిన ఈ ఇద్దరు అమర్నాథ్ యాత్రలో తమ అనుభవాల గురించి పారవశ్యంతో తెలియచేస్తున్న వీడియోను స్థానిక జిల్లా అధికార యంత్రాంగం వెలువరించింది.
తాము కాలిఫోర్నియాలోని ఓ దేవాలయంలో ఉంటామని, చాలా ఏళ్లుగా తమకు అమర్నాథ్ యాత్ర జరపాలని, శివుడిని సందర్శించుకోవాలనే కల ఉందని వీరు తెలిపారు. ఇక్కడ జరిగే హారతి ఇతరత్రా పూజాలను అప్పుడప్పుడు వీడియోల్లో చూస్తూ ఉంటామని , ఇప్పుడు ఇక్కడికి వచ్చి పూజాదికాల్లో పాల్గొనడం తమకు చెప్పలేని అనుభూతినిని తెచ్చిపెట్టిందని వీరు తెలిపారు. కాషాయ దుస్తులు, పొడవాటి గడ్డంతో ఉన్న వీరు తాము స్వామి వివేకానంద శిష్యులమని చెప్పారు. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. జమ్మూ నుంచి ప్రారంభం కావాల్సిన అమర్నాథ్ యాత్రను ఇవాళ నాలుగో రోజు కూడా రద్దు చేశారు. జమ్మూ-శ్రీనగర్ హైవేను మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.