భారత్ది అసాధారణ విజయ గాథ అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శ్లాఘించారు. ప్రధాని నరేంద్ర మోడీపై బ్లింకెన్ ప్రశంసల వర్షం కురిపిస్తూ, ఆయన విధానాలు, కార్యక్రమాలు భారత ప్రజలకు ఎంతో ప్రయోజనకరమైనవి అని అభివర్ణించారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్లుఇఎఫ్) వార్షిక సమావేశం 2024 లో బ్లింకెన్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని మోడీ మధ్య అద్భుత సంబంధాలు ఉన్నాయని, వారి చర్చల్లో యుఎస్, భారత్ సంబంధాలతో సహా అన్ని అంశాలు చోటు చేసుకుంటాయని చెప్పారు.
ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తరణను బ్లింకెన్ కొనియాడుతూ, యుఎస్, భారత్ సదా సంభాషణలు సాగిస్తుంటాయని, ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులతో సహా అన్ని అంశాలు వాటిలో చోటు చేసుకుంటాయని చెప్పారు. మేము ఎల్లప్పుడూ సాగిస్తుండే వాస్తవిక సంభాషణలలో అవి భాగం అని ఆయన తెలిపారు.