భారతదేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా డాలస్ మేయర్ ఎరిక్ జాన్సన్ డాలస్ సిటీ హాల్లో కొద్ది మంది ప్రవాస భారతీయ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆగస్టు 15వ తేదీని డాలస్లో ఇండియన్ అమెరికన్ డేగా గుర్తిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ డాలస్, ఫోర్ట్ వర్త్ నగర పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండు లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తూ వైద్య, విద్య, వ్యాపార, వాణిజ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో చేస్తున్న కృషిని ప్రశంసించారు.
ఉత్తర టెక్సాస్లో ప్రవాస భారతీయులు వివిధ వ్యాపారా రంగాల్లో స్థిరపడి 10 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని సృష్టిస్తూ ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. డాలస్ మేయర్ ఆత్మీయ ఆహ్వానం మేరకు ఈ ప్రత్యేక అభినందన కార్యక్రమంలో ప్రవాస భారతీయ నాయకులు అరుణ్ అగర్వాల్, సల్మాన్ ఫర్ షోరి, రజనీష్ గుప్తా, డా.ప్రసాద్ తోటకూరలకు మేయర్ ఎరిక్ జాన్సన్ ఆగస్టు 15వ తేదీన డాలస్లో ఇండియన్ అమెరికన్ డే గా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన అధికారిక పత్రాన్ని అందజేశారు.