Namaste NRI

బ్రెజిల్‌ అతలాకుతలం… ఎలాన్‌ మస్క్‌ సాయం

బ్రెజిల్‌ను గత కొన్ని రోజులుగా  భారీ వర్షాలు, వరదలు  ముంచెత్తుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్త మైంది. చాలా ప్రాంతాలు పూర్తిగా నీట మునగడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ వరదలకు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల ధాటికి ఆ దేశ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 107కు చేరింది. సుమారు 136 మంది గల్లంతయ్యారు. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. సుమారుగా 165,000 మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని పడవలు, హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఈ వరదలకు రియో గ్రాండ్‌ డొ సుల్‌  రాష్ట్రంలో తీవ్రం నష్టం వాటిల్లింది. కుండపోత వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వరదలు సంభవించాయి. అక్కడ వరదలకు మౌలిక సదుపా యాలు, వంతెనలను పూర్తిగా ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్‌, సమాచార వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఈ నష్టాన్ని పూడ్చేందుకు 19 బిలియన్ రియాస్ అవసరమవుతుందని గవర్నర్ ఎడ్వర్డో లైట్ తెలిపారు.

మరోవైపు వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న రియో గ్రాండ్‌ డొ సుల్‌ రాష్ట్రానికి బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌  తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అత్యవసర ప్రతిస్పందనదారులకు 1000 శాటిలైట్‌ టర్మినల్స్‌ను (ఇంటర్నెట్‌ సౌకర్యం) కల్పిస్తున్నట్లు ప్రకటించారు. బ్రెజిల్‌ ప్రజలకు ఈ సాయం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు మస్క్‌ తెలిపారు. మరోవైపు రానున్న రోజుల్లో మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. నీటి మట్టాలు మరింత పెరిగి నగరాలను వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events