ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు శ్రీ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందర రాజన్(90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చిలుకూరులోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు ఆలయ ప్రస్తుత అర్చకులు రంగ రాజన్ వెల్లడించారు. భక్తులతో కలిసిపోయి స్వామి వారి సేవలు, ప్రసాదము గురించి వివరించేవారు.సౌందర రాజన్ మరణించారన్న వార్త తెలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకుడిగా, రిజిస్ట్రార్గా ఎంతో మంచి పేరు గడించిన సౌందర రాజన్ ఆధ్యాత్మిక చైతన్యం విస్తరింపజేయడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు.

సౌందర రాజన్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, సౌందర రాజన్ మృతిపట్ల ముఖ్యమంత్రి వారి కుటుంబానికి, శ్రేయోభిలాషులకు సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.















