
లండన్ లో తెలుగువారు హోలీ సంబరాల్లో మునిగి తేలారు. సుమారు 3000 మందికిపైగా వేడుకలకు హాజరయ్యారు. లండన్ కు 20 మైళ్ళ దూరంలో డార్ట్ ఫోర్డ్ సిటీలో ఈ సంబరాలు జరిగాయి. డార్ట్ ఫోర్డ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకను ప్రవాసులందరూ ఒక దగ్గర చేరి ఉత్సాహంగా జరుపుకున్నారు. డార్ట్ఫోర్డ్ బరో కౌన్సిల్, ఆర్ట్స్ కౌన్సిల్, ఇంగ్లండ్, కొహేషన్ ప్లస్ మద్దతుతో స్థానిక కమ్యూనిటీ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రిటన్ పార్లమెంటు సభ్యుడు జిమ్ డిక్సన్, డిప్యూటీ లెఫ్ట్ నెంట్ గుర్వింద్ సాందర్, డార్ట్ఫోర్డ్ మేయర్ పీటర్ వాప్షషాట్, కౌన్సిలర్స్ అవతార్ సంధు, రిచర్డ్ వేల్స్, డార్ట్ఫోర్డ్ కౌన్సిల్ నాయకుడు జేరేమీ కైట్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు, మహిళల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ప్రముఖులు వారికి బహుమతులు అందించారు.
















