Namaste NRI

అమెరికాలో భారత విద్యార్థికి ఘోర అవమానం

అమెరికాలో భారత విద్యార్థికి ఘోర అవమానం జరిగింది. భారత విద్యార్థి న్యూయార్క్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే అక్కడి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నేలకేసి నొక్కిపెట్టి హింసించారు. చేతులకు సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అమెరికా నుంచి బహిష్కరించారు. సోషల్ మీడియా యూజర్, సామాజిక వ్యవస్థాపకుడు కునాల్ జైన్ ఈ దారుణం గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. నిన్న రాత్రి న్యూయార్క్ విమానాశ్రయంలో యువ భారతీయ విద్యార్థి చేతికి సంకెళ్లు వేశారు. ఏడుస్తున్న అతడి పట్ల నేరస్థుడిలా ప్రవర్తించడాన్ని నేను చూశా. తన కలల కోసం అతడు వచ్చాడు. ఎలాంటి హాని కలిగించలేదు. ఒక ఎన్‌ఆర్‌ఐగా నేను నిస్సహాయంగా ఉండిపోయా. హృదయ విదారకంగా భావించా. ఇది ఒక మానవ విషాదం అని పేర్కొన్నారు.

కాగా, ఆ భారతీయ విద్యార్థి హర్యానాలో మాట్లాడినట్లు కునాల్ జైన్ తెలిపారు. వీసా పొంది అమెరికా వచ్చే ఇలాంటి పిల్లలు తాము ఎందుకు వచ్చామో అన్నది ఇమ్మిగ్రేషన్ అధికారులకు వివరించలేక పోతున్నారని అన్నారు. దీంతో వారి పట్ల ఇలా ప్రవర్తించి, సంకెళ్లు వేసి తిరుగు విమానంలో పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఇలాంటి కేసులు మూడు, నాలుగు జరుగుతున్నాయని ఆరోపించారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీటిపై స్పందించాలని జైన్ కోరారు.

Social Share Spread Message

Latest News