హైదరాబాద్లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ తప్పుకున్నారు. ఈ అందాల పోటీల నిర్వాహకులపై అసంతృప్తితో మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగి ఈ పోటీల నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. ఆమె హైదరాబాద్ను వీడి ఇంగ్లండ్కు వెళ్లిపోయినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే పోటీల నుంచి తప్పుకున్నట్లు నిర్వాహకులకు చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే, పోటీల నుంచి తప్పుకున్న తర్వాత ఇంటర్వ్యూలో మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ పోటీ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలిసింది. పోటీ నిర్వాహకులు తనను ఓ వేశ్యగా చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు తనతో కొందరు అగౌరవంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. వినోదం కోసం మమ్మల్ని వీధుల్లో తిప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని చెప్పుకొచ్చింది. అందుకే మనస్తాపంతో పోటీల నుంచి తప్పుకున్నట్లు తన గోడును వెల్లబోసుకుంది. సమాజంలో మార్పు తీసుకురావడానికి, యువతలో స్ఫూర్తి నింపేందుకు నేను అక్కడికి వెళ్లాను. అయితే, అక్కడ పరిస్థితులు వేరు. కొందరిని సంతృప్తి పరిచేందుకు కోతుల్లా ప్రదర్శన ఇచ్చేందుకు మేం అక్కడున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించుకోలేదు. చాలా అగౌరవంగా అనిపించింది. మనల్ని అక్కడ ఎంత తక్కువగా చూస్తున్నారో అర్థమైంది అని మిల్లా తన ఆవేదనను చెప్పుకుంది.

మాగీ వైదొలగిన విషయాలపై మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. సంస్థ ఛైర్పర్సన్, సీఈఓ జూలియా మోర్లే శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ నెల ప్రారంభంలో మిల్లా మాగీ తన తల్లి, కుటంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి కారణంగా ఈ పోటీల నుంచి విరమించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారనారు. మిల్లా పరిస్థితిని అర్థం చేసుకొని ఆమెను ఇంగ్లాండ్కు తిరిగి పంపే ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఆమె స్థానంలో రన్నరప్ చార్లొట్టే గ్రాంట్ ఇంగ్లాండ్ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకొచ్చారని, ఆమె బుధవారం హైదరాబాద్ చేరుకున్నారని, ఈ పోటీలలో ఆమె ఇంగ్లాండ్ తరపున పాల్గొంటున్నారని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
