హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) రూ.85లక్షల (లక్ష డాలర్ల) విరాళం అందజేసింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో నాట్స్ 8వ తెలుగు సంబరాల ముగింపు రోజైన (ఈ నెల 6న) ఈ విరాళాన్ని ఆస్పత్రి చైర్మన్, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, నాట్స్ సభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, బోర్డు చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటి చేతులమీదుగా అందజేశారు. నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమను తాము తెలుసుకొని ప్రేమించడం నేర్చుకోవాలన్నారు. సినీ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ బృందంతో కలిసి బాలకృష్ణ పాటలు పాడి అలరించారు. అనంతరం శక పురుషుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సినీ నటులు జయసుధ, మీనా, శ్రీలీలను నాట్స్ ప్రతినిధులు సత్కరించారు. సంబరాల్లో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, సినీ నటుడు వెంకటేశ్, నందమూరి రామకృష్ణ, అట్లూరి అశ్విన్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, గౌతు శిరీష, వసంత కృష్ణప్రసాద్, చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు.
















