అమెరికా, దక్షిణ కొరియాకు పక్కలో బళ్లెంలా ఉత్తర కొరియా తయారైంది. వరుసగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ ఇరు దేశాలకు గట్టి హెచ్చరికలు జారీచేస్తున్నది. అమెరికాతో కలిసి దక్షిణ కొరియా పెద్దఎత్తున సైనిక డ్రిల్స్ నిర్వహిస్తుండటంతో, తామూ తగ్గేది లేదని కిమ్ కింగ్డమ్ స్పష్టం చేస్తున్నది. తూర్పు తీరంలోని సముద్ర జలాలవైపు రెండు బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించింది. ఉత్తర వాంఘే ప్రావిన్స్లో ఉన్న జుంగ్వాలో రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడాన్ని తామ సైన్యం గుర్తించిందని దక్షిణ కొరియా జాయింట్ ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. అవి తూర్పు తీరంలోని సముద్ర జలాలవైపు పయణించాయని తెలిపారు. వాటిని జపాన్ సముద్రంగా కూడా పిలుస్తారన్నారు. దక్షిణ కొరియాతో కలిసి అమెరికా సైనిక కసరత్తులు చేసిన నేపథ్యంలో వరుసగా క్షిపణులను ప్రయోగిస్తూ వస్తున్నది. ఇరుదేశాలు నిర్వహిస్తున్న సైనిక కసరత్తులను తమ దేశంపై దండయాత్రకు రిహార్సల్స్ అని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోపించారు. ఈ నెలలో ఉత్తరకొరియా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణుల సంఖ్య ఏడుకు చేరింది. గతేడాది 70 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించడం విశేషం.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/9b2e2916-b215-4ea8-a1f7-30db781e0172-6.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/41766551-9753-415b-b545-44b631521b31-6.jpg)