రామ్చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన చిత్రంపెద్ది. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల విడుదలైన రై రై రార పాటకు మంచి స్పందన లభిస్తున్నది. ఏ.ఆర్.రెహమాన్ స్వరపరచిన ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రచించారు. ఈ సందర్భంగా గీత రచయిత అనంత శ్రీరామ్ విలేకరులతో ముచ్చటించారు. ఈ పాట తాలూకు చర్చల్లో ప్రబోధాత్మకంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. లోతైన భావాల్ని చెబుతూనే వ్యవహారిక భాషలో పాట ఉండాలని దర్శకుడు బుచ్చిబాబు సానా సూచించారు. అందుకు తగినట్లుగానే మిత్ర సంహిత అనే ప్రక్రియలో పాట రాశాను. ఈ పాట వింటున్నప్పుడు స్నేహితులిద్దరూ కలిసి మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది.

నా దృష్టిలో సినిమా పల్లకిని పాట మోయాలి. అప్పుడే పాటకు ప్రయోజనం. అందుకే ఈ పాటను శ్రీశ్రీ గేయ కవితలా రాశాను. శ్రీశ్రీ కవితలు చదువుతున్నప్పుడు ఎలాంటి ఉద్వేగం ఉంటుందో అలాంటి ప్రాసలతో ఈ పాట రాశాను. మాస్ పరిభాషలో ఫిలాసఫీ చెప్పడం కత్తిమీద సాములా అనిపించింది. అందుకే ఈ పాట రాయడానికి రెండు నెలలు కసరత్తులు చేశాను. ఒక పాట రాస్తే, ఆత్మహత్య ఆలోచనలు వచ్చిన వారు వాటిని విరమించుకునేలా ప్రేరణ కలిగించాలి. అలాంటి పాట రాసినప్పుడు నా రచన సార్థకమైనట్లు భావిస్తాను. అలాంటి లక్షణాలు ఈ పాటలో ఉన్నాయనుకుంటున్నా. ఈ పాట విన్న రామ్చరణ్ నన్ను హత్తుకొని అభినందించారు.















