తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం పురస్కరించుకుని బీఆర్ఎస్ యూఎస్ఏ యువజన విభాగం ఆధ్వర్యంలో డాలస్ నగరంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్, ఎల్బీనగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ విప్ రసమయి బాలకిషన్ తన గానంతో సభికులను మంత్రముగ్ధులను చేశారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ పేదల కోసం, గ్రామాల కోసం, రైతుల కోసం విప్లవాత్మక మార్పులు, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్, కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. తెలంగాణకు నీటిని తెచ్చిన విజనరీ నాయకుడిగా కేసీఆర్ను ఆయన ప్రశంసించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. ఆయన నాయకత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిందని తెలిపారు.


ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్, గాదరి కిశోర్, పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గ్యాదరి బాలమల్లు, జాన్సన్ నాయక్, ముఠా జయసింహ, పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఆశిష్ యాదవ్, అభిలాష్ రంగినేని, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డాలస్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల విద్యార్థుల తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వందలాది మంది యువత, విద్యార్థులు, యువజన నాయకులు పాల్గొన్నారు.
