అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన మతిమరుపుతో మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికాలోని యూఎస్ దేశంలో అని సంబోధించి ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యారు. విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ లో జరిగిన ఓ కార్యక్రమంలో అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యల్ప ద్రవ్యోల్బణ రేట్లను యూఎస్ కలిగి ఉందని చెప్పడానికి బదులుగా, అమెరికాలో ఏ దేశంలో లేనంత తక్కువ ద్రవ్యోల్బణ రేట్లు యూఎస్లో ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ధరల కంటే వేతనాలే వేగంగా పెరుగుతున్నాయి. అమెరికాలోని ఏ దేశానికీ లేనంత తక్కువ ద్రవ్యోల్బణం రేట్లు యూఎస్లో ఉన్నాయి. దాన్ని మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాము అంటూ వ్యాఖ్యానించారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ బైడెన్ వ్యాఖ్యలు ప్రత్యర్థులకు ప్రచారస్త్రంగా మారాయి . పలువురు రిపబ్లికన్ పార్టీ నేతలు బైడెన్ వ్యాఖ్యలకు సంబంధించిన విమర్శలు చేస్తున్నారు. అమెరికాలో దేశాలు ఉన్నాయా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
