పశ్చిమాసియా యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. రెండు వారాల కాల్పుల విరమణకు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరించాయి. ఇరాన్ నాగరికతను నాశనం చేస్తానన్న తన హెచ్చరికల నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గడానికి వీలు కల్పించిన చివరి నిమిషపు ఒప్పందం ఇది. యుద్ధంలో తమదే విజయమని అటు అమెరికా, ఇటు ఇరాన్ ప్రకటించాయి. కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఇరాన్, లెబనాన్, గల్ఫ్ దేశాల్లో బుధవారం మళ్లీ దాడులు జరిగాయి.లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీన్ని నిరసిస్తూ హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. లెబనాన్పై దాడులు ఆపకపోతే ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరించిది.

అమెరికా ఉపాధ్యక్షుడు క్లిష్టమైనదిగా అభివర్ణించిన ఈ ఒప్పందం నీరుగారిపోవడానికి తాజా దాడులు కారణమౌతాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒప్పందంలోని అంశాలపై ఉభయపక్షాలు భిన్న వివరణలు ఇవ్వడంతో కాల్పుల విరమణ ఒప్పందంపై ఇప్పటికీ స్పష్టత లేదు. హొర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై రవాణా రుసుము వసూలు చేసే విధానాన్ని అధికారికం చేసుకోవడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుందని ఇరాన్ తెలిపింది. కానీ ఒప్పందంలోని అంశాలు స్పష్టంగా లేవు. అలాగే చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గాన్ని ఉపయోగించడం నౌకలకు సురక్షితమనిపిస్తుందో లేదో కూడా స్పష్టత లేదు. ఈ షరతుకు వేరే ఏ దేశమైనా అంగీకరించిందీ కూడా స్పష్టత లేదు.















