చిరంజీవి హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్గారు. నయనతార కథానాయిక. అనిల్ రావిపూడి దర్శకుడు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలు. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడారు.నా మిత్రుడు, సోదర సమానుడు వెంకీతో పనిచేయడం ఆనందంగా ఉంది. తనతో కలిసి నటించాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. తనతో ఎంజాయ్ చేస్తూ నటించాను. ఏదేమైనా ఈ సినిమా స్థాయిని పెంచిన వెంకీకి థ్యాంక్స్ చెబుతున్నా. మేమిద్దరం పూర్తిస్థాయి సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అనిల్ రావిపూడి ఆ సినిమాను డైరెక్ట్ చేస్తే ఇంకా హ్యాపీ. అనిల్ రావిపూడితో నీ కాంబినేషన్ బావుంటుందని కె.రాఘవేంద్రరావు కొన్నాళ్ల క్రితం అన్నారు. అనుకోకుండా ఆయన చేతులతోనే ఈ సినిమా మొదలైంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ ఈ కథ నాకు చెప్పాడు. ఇందులో వినోదం ఉంది. భావోద్వేగాలున్నాయి. వైవిధ్యంగా చేద్దాం అనుకున్నాను. కానీ అస్సలు వద్దు, మీ పాత సినిమాల్లోని నటనను గుర్తు చేసేలా నటిస్తే చాలు, మీరంటే ఏంటో ఈ జనరేషన్కి పరిచయం చేయాలనుకుంటున్నా అన్నాడు అనిల్. నాకు ఏది సౌకర్యంగా ఉంటుందో అలా నా పాత్రను తీర్చిదిద్దాడు. అతనితో పనిచేయడం గొప్ప ఎక్స్పీరియన్స్. అందుకే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన ఆఖరు రోజున ఎమోషనల్ అయ్యాను. ఈ సినిమా ఆల్రెడీ సూపర్హిట్ అయిపోయింది. బడ్జెట్ దాటనీయకుండా, టైమ్కు సినిమా తీసేశాడు. ఆ విధంగా తొలి విజయం సాధించాడు. ఇక మిగిలింది రిలీజ్ తర్వాత ఎలాగూ దక్కుతుంది. ఈ సంక్రాంతి తెలుగు సినిమా గర్వించే సంక్రాంతి అవ్వాలి. సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నీ బాగా ఆడాలి అని అన్నారు.

ఈ సినిమాలో అతిథి పాత్ర పోషించిన మరో అగ్ర హీరో విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ చిరంజీవితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. ఇందులో ఇద్దరం రఫ్ ఆడేశాం. నా తమ్ముళ్లు మహేశ్, పవన్కల్యాణ్లతో సినిమాలు చేశాను. ఇప్పుడు అన్నయ్యతో చేశాను. మోత మోగిపోవాలి. అనిల్తో నా కాంబినేషన్ సామాన్యమైనది కాదు. అన్నీ హిట్సే. అద్భుతమైన టీమ్ ఈ సినిమాకు పనిచేశారు. మంచి ఫ్యామిలీ సినిమా సంక్రాంతికి రాబోతున్నది. హిట్ చేస్తారని ఆశిస్తున్నా అన్నారు.















