సిట్ పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేపట్టిన డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనని బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వెబ్ సిరీస్లాంటి రాజకీయ నాటకాన్ని నడుపుతోందని విమర్శించారు.

ఒక రోజు కేటీఆర్, మరో రోజు హరీష్రావు, నిన్న సంతోష్రావు ఇలా రోజుకో బీఆర్ఎస్ నాయకుడిని సిట్ పేరుతో పిలుస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికాలో ఉండగా, అక్కడి నుంచి తన నాయకులు ఏదో చేస్తారనే ఉద్దేశంతో ఈ విధమైన డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి కక్షపూరిత కేసులు, విచారణలు పెడుతున్నారని స్పష్టం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలు రైతుల కష్టాలు, నిరుద్యోగం, హామీల అమలు వైఫల్యం, పాలనలో గందరగోళం, వీటిపై మాట్లాడకుండా, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని నోటీసులు, విచారణల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.















