అమెరికా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వారి కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే గోల్డ్ కార్డు ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా ఈబీ-5 స్థానంలో గోల్డ్ కార్డు తీసుకురానున్నట్లు వెల్లడించారు. 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.44 కోట్లు) చెల్లించగలిగే వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు.తాజాగా ఈ గోల్డ్ కార్డుకు సంబంధించి వెబ్సైట్ను ట్రంప్ ప్రారంభించారు.

ఐదు మిలియన్ డాలర్లకు, ట్రంప్ కార్డ్ వస్తోంది. అమెరికా పౌరసత్వాన్ని కొనుగోలు చేసేందుకు వేలాది మంది కాల్ చేసి, ఎలా నమోదు చేసుకోవాలని అడుగుతున్నారని అందులో పేర్కొన్నారు. అయితే, గోల్డ్ కార్డ్ ఇంకా కొనుగోలుకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి వ్యక్తిగత వివరాలను నమోదుకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ట్రంప్ కార్డు లేదా గోల్డ్ కార్డు కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు trumpcard.gov అనే వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. అప్లై చేసే వారి పేరు, ప్రాంతం, ఈ-మెయిల్ సహా ఇతర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. పౌరసత్వ కార్డుల ద్వారా వేగంగా జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని కొంత వరకు తగ్గించవచ్చు అన్న అభిప్రాయంలో ట్రంప్ ఉన్నారు. ఈ క్రమంలో ఈబీ-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ స్థానంలో గోల్డ్ కార్డు ఆఫర్లను ప్రకటించారు.
