Namaste NRI

ఆపిల్ సీఈవో టిమ్‌ కుక్‌తో ట్రంప్‌ భేటీ … భారత్‌కు తరలించొద్దు

ఖతార్‌ వేదికగా భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన అక్కసు వెళ్లగక్కారు. భారత్‌లో యాపిల్‌ సంస్థను విస్తరించొద్దని ఆ సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌ కు సూచించారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంపే స్వయంగా వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్‌ ప్రస్తుతం అరబ్‌ దేశాల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. తన పర్యటనలో భాగంగా నిన్న ఖతార్‌ను సందర్శించారు. ట్రంప్‌ కోసం ఎమిర్‌ ఆఫ్‌ ఖతార్ దోహాలో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు పలువురు సీఈవోలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఈ విందుకు హాజరైన యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌తో ట్రంప్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని టిక్‌ కుక్‌కు తెలియజేశారు. భారత్‌లో యాపిల్‌ సంస్థను విస్తరించొద్దని సూచించారు.

నాకు టిమ్‌ కుక్‌తో నిన్న చిన్న సమస్య ఎదురైంది. అతడు భారత్‌లో తయారీ కర్మాగారాల నిర్మాణాలు చేపట్టారు. అలా చేయడం నాకు ఇష్టం లేదని చెప్పాను. ఫలితంగా అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు యాపిల్‌ అంగీకరించింది. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్‌ ఒకటి. అక్కడ వ్యాపారం చేయడం చాలా కష్టమని టిమ్‌ కుక్‌కు వివరించా. భారత్‌ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ దేశం తనను తాను చూసుకోగలదని చెప్పా. నా వల్ల యాపిల్‌ సంస్థ ఇప్పుడు యూఎస్‌లో 500బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News