సాంకేతిక రంగంలో కృత్రిమమేధ (ఏఐ) విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నది. అరచేతిలో ఇమిడే స్మార్ట్ఫోన్, నోట్బుక్ల అడ్వాన్స్డ్ వెర్షన్లు ఏఐ టెక్నాలజీతో కొత్త రూపును సంతరించుకొంటున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన క్వాడ్రిక్ ఐటీ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్ నోట్బుక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజిటల్ స్మార్ట్ నోట్బుక్ల మాదిరి కాకుండా చేతిలో పుస్తకాన్ని పట్టుకొన్నట్టు ఉండే ఈ ఏఐ నోట్బుక్ను నీటితో సులభంగా శుభ్రపర్చవచ్చు. ఏకంగా 100 సార్లు వాడుకోవచ్చు.

ఈ నోట్బుక్పై రాసే హ్యాండ్రైటెడ్ నోట్స్ను డిజిటల్ టెక్ట్స్గా మార్చి క్లౌడ్ స్టోరేజీలోనూ భద్రపర్చుకోవచ్చు. ఈ మేరకు నోట్బుక్ను అభివృద్ధి చేసిన హైదరాబాదీ టెకీలు కేసరి సాయికృష్ణ సాబ్నివీశు, రఘురాం తాతవర్ధి, సుమన్ బాలబొమ్ము పేర్కొన్నారు. తమ డివైజ్తో కాగితపు వాడకాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేయవచ్చని సాయికృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. ఈ వినూత్న స్మార్ట్ నోట్బుక్, దాని వివరాలను హైదరాబాద్లో జరుగనున్న బయోఏషియా-2025 సదస్సులో ప్రదర్శించనున్నారు.