ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన అత్యవసర సమావేశంలో పలు దేశాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రష్యాపై ఆయా దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రష్యా దాడుల వల్ల జరిగే విధ్వసం, ప్రాణనష్టానికి ఆ దేశానిదే పూర్తి బాధ్యత అని అమెరికా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని రష్యా ఉల్లంఘించిందని చెప్పింది. రష్యా సైనిక చర్యను ఆపాలని, బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని పేర్కొంది. తాము తమ మిత్ర దేశాలతో కలిసి ఐక్యమత్యంతో నిర్ణయాత్మకంగా స్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే పుతిన్ ఈ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పుతిన్ ఓ దురాక్రమణవాది, అందుకే ఈ తరహా యుద్ధాన్ని ఎంచుకొన్నారు. ఇకపై జరగబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా ఉండాలని అన్నారు. దేశంలోని రష్యా ఆస్తులను ఫ్రీజ్ చేయడమే కాకుండా ఆ దేశంపై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఉక్రెయిన్కి తమ బలగాలను పంపించబోమని స్పష్టం చేశారు.