ఖతార్లోని ఆంధ్ర కళావేదిక వెంకప్ప భాగవతుల అధ్యక్షతన అత్యంత వైభవంగా సంక్రాంతి పండుగను నిర్వహించారు. తెలుగు నేపథ్య గాయకులు ప్రవీణ్ కుమార్ కొప్పోలుకు తోడుగా సత్యభామ స్వాతి, ప్రముఖ జానపద గాయకురాలు శిరీష, అత్యంత ప్రజాదరణ పొందిన డాన్స్ షో ఢీ ఫేమ్ డాన్స్ మాస్టర్ పండు, మాధురి తమ పాటలతో ప్రేక్షకులను ఆద్యంతం ఓలలాడించి ఉర్రూతలూగించారు. ఆంధ్ర కళావేదిక అధ్యక్షుడు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ కార్యక్రమానికి సుమారు 1000 మందికి పైగా హాజరయ్యారని, సమయాభావాన్ని కూడా లెక్కచెయ్యకుండా ప్రేక్షకులు కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదించారు అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా నిర్వహించుకోటానికి సహకరించిన ప్రాయోజితులుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ సభ్యులు గొట్టిపాటి రమణ, విక్రమ్ సుఖవాసి, వీబీకే మూర్తి, శ్రీ సుధ, సోమరాజు, రవీంద్ర, శేఖరం రావు, సాయి రమేష్, కేటీ రావు, శిరీష రామ్ బృందం చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్వచ్ఛంద సేవకులు కి ప్రత్యేకించి రమేష్, మెసయిద్ టీంకి, వేదిక ప్రాంగణ అలంకరణకు సహకరించిన మహిళలందరికీ మరియు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులను, వారి తల్లితండ్రులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఖతార్లోని భారత రాయబార కార్యదర్శి సచిన్ దినకర్ శంక్పాల్ మాట్లాడుతూ బాషా, కళా, సాంస్కృతిక, సేవా రంగాలలో చేస్తున్న కృషికి ఆంధ్ర కళావేదిక కార్యవర్గ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ అడిషనల్ ప్రెసిడెంట్ వినోద్ నాయర్, శ్రీ కృష్ణ కుమార్ -ప్రధాన కార్యదర్శి, ఇండియన్ కల్చరల్ సెంటర్ మెడికల్ అసిస్టెన్స్ హెడ్ రజని మూర్తి, Aఖప సలహామండలి చైర్మన్ సత్యనారాయణ, తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ గద్దె, హరీష్ రెడ్డి ఇతర ప్రముఖులు మరియు తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆనందించి వారి అభినందనలు తెలియజేసారు.
ఈ కార్యక్రమానికి ఖ్యాతి, అనన్యలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. చూడామణి, శ్రీ సుధ వారి వెన్నుండి సహకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వేదిక ప్రాంగణం అలంకరణ, బొమ్మల కొలువు, గొబ్బిళ్ళు, ముగ్గులు, చిన్నారుల నాట్యాలు, రుచికరమైన సాంప్రదాయ తెలుగింటి భోజనం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శి విక్రమ్ సుఖవాసి ముగింపు సందేశ ధన్యవాదాలతో కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది.