
ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్ జగదీశ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కోర్ట్- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా నటుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ కోర్ట్ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన చాలా అనందాన్ని ఇచ్చింది. నా 25 ఏళ్ల కల మంగపతి పాత్రతో నెరవేరింది అని అన్నారు.

మంగపతి పాత్ర నా కోసమే పుట్టిందని భావిస్తున్నాను. ఈ పాత్రలో సహజమైన భావోద్వేగం ఉంది. ప్రతి కుటుంబంలో ఇలాంటి స్వభావమున్న వ్యక్తి ఉంటారు. నాని గారు నటుడిగా నిరూపించుకొని, ఇప్పుడు నిర్మాతగానూ రాణిస్తున్నారు. కొత్త నటీనటులను ప్రోత్సహించడంలోనూ చొరవ చూపిస్తున్నారు. కోర్ట్ సినిమా బాగోకపోతే తన హిట్ 3 చిత్రాన్ని చూడొద్దంటూ సవాలు విసరడం మామూలు విషయం కాదు అని అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ రివ్యూలో యానిమల్ లో బాబీ డియోల్ కంటే శివాజీ బాగా చేశాడు అని రాశారని, ఆ మాట విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యానని చెప్పారు.
