ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు. అమరావతి సీఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరిస్తూ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టింది. ఏపీ పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు శాసనసభలో ప్రభుత్వం ప్రకటించింది.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అమరావతి ప్రాంతమంటే తనకు వ్యతిరేకత లేదని అన్నారు. మూడు రాజధానుల బిల్లును మెరుగుపరుస్తామని తెలిపారు. పూర్తి సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లును తీసుకొస్తామని తెలిపారు. కనీస వసతుల కల్పనకు అంత డబ్బులేనప్పుడు రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యం అవుతుందా? రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే గతంలో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేశాం. రాజధానిపై మా నిర్ణయాన్ని ఈ రెండేళ్లలో రకరకాలుగా వక్రీకరించారు. వికేంద్రీకరణ సరైన మార్గమని నమ్మి చర్యలు చేపట్టాం. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఇప్పటికీ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందేవి. సమగ్రమైన బిల్లుతో మళ్ళీ సభ ముందుకు వస్తాం. అందరితో చర్చించి అవాంతరాలు లేకుండా ఈసారి కొత్త బిల్లు పెడతాము అని జగన్ స్పష్టం చేశారు.