అక్రమ వలసదారులకు అమెరికా బంపరాఫర్ ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా వారి స్వదేశాలకు వెళ్లిపోవడానికి సిద్ధమైతే వారికి 2600 డాలర్లు (రూ.2,40,339) ఎగ్జిట్ బోనస్ అందించనున్నట్టు ప్రకటించింది. ఈ బోనస్తో పాటు స్వదేశాలకు విమానంలో ఉచితంగా పంపించడానికి ఏర్పాట్లు కూడా చేస్తామని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

తాము స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీపీ హోమ్ యాప్ ద్వారా తెలియజేసే వారి పేర్లను, బలవంతంగా స్వదేశాలకు తరలించాల్సిన వారి జాబితా నుంచి తొలగిస్తామని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంది. అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపడానికి జనవరి 2025 నుంచి అమెరికా చర్యలు ప్రారంభించినట్టు తెలిపింది. అందుకోసం తాము పలు ఆఫర్లు కూడా అక్రమ వలసదారులకు ఇస్తున్నట్టు తెలిపింది.

గత జనవరి నుంచి ఇప్పటివరకు 22 లక్షల మందికి పైగా వలసదారులు అమెరికాను వీడి స్వదేశాలకు వెళ్లినట్టు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. స్వదేశాలకు స్వచ్ఛందంగా తిరిగి వెళ్లడమే, అక్రమ వలసదారుల ముందున్న సురక్షితమైన, చవకైన మార్గమని సూచించింది. అలా చేస్తే అరెస్ట్ కాకుండా తప్పించుకోవచ్చని తెలిపింది.















