అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రంలో నెలకొన్న అతి పెద్ద హిందూ దేవాలయం శ్రీ వెంకటేశ్వర ఆలయం లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ నెల 24న ఇక్కడ నిర్మించిన 87 అడుగుల భారీ గోపురాన్ని దీపావళి సందర్భంగా ఆవిష్కరించారు. ఐక్యత, శ్రేయస్సుల గోపురం పేరుతో నిర్మించిన ఈ కట్టడాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ గేరీ కూపర్ ప్రారంభించారు. రాయల్ గేట్వే టు గాడ్ గా పిలుస్తున్న ఈ గోపురం నిర్మాణ పనులను 2020లో ప్రారంభించినట్లు ఆలయ ట్రస్టీల బోర్డు జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ శ్రీనివాసన్ తెలిపారు. ఈ గోపురం వద్ద దేవుడి ముందు తల వంచి తమ బాధలను విడిచి రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తారని ఆలయ చైర్మన్ రాజ్ తోటకూర పేర్కొన్నారు. దీని నిర్మాణం కోసం 5 వేల మందికి పైగా హిందువులు 25 లక్షల డాలర్ల విరాళాలు అందించారు.
