హీరో మహేశ్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది.సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్బాబు (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హటాహుటిన ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం రమేశ్బాబు భౌతికకాయాన్ని ఏఐజీ మార్చురీలో ఉంచారు. అక్టోబర్ 13, 1965లో జన్మించిన రమేశ్ బాబు అల్లూరి సీతారామరాజు (1974) చిత్రంతో బాలనటుడిగా వెండితెర ప్రవేశం చేశారు. సుమారు 15 చిత్రాల్లో రమేశ్ బాబు హీరోగా నటించారు.
కృష్ణ, మహేశ్బాబుతో కలిసి పలు సినిమాల్లో నటించారు. నా ఇల్లే నా స్వర్గం, అన్నా చెల్లెలు, పచ్చతోరణం, ముగ్గురు కొడుకులు, సామ్రాట్, చిన్ని కృష్ణుడు, కృష్ణగారి అబ్బాయి. బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, బ్లాక్ టైగర్, ఆయుధం, కలియుగ అభిమన్యుడు, చివరిగా తండ్రి కృష్ణతో కలిసి ఎన్కౌంటర్ చిత్రంలో నటించారు. 1997 నుంచి నటనకు దూరంగా ఉన్న రమేశ్బాబు 2004లో నిర్మాతగా మారారు. అర్జున్, అతిథి సినిమాలు నిర్మించారు. రమేశ్ బాబు మరణ వార్త తెలియడంతో ఘట్టమనేని అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.














