
దాయాది పాకిస్థాన్ కు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ , దానికి చెందిన మజీద్ బ్రిగేడ్ ని విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాలంటూ యూఎన్ భద్రతామండలిలో చైనా, పాక్ చేసిన అభ్యర్థనను అమెరికా అడ్డుకుంది. బలూచ్ ఆర్మీ, మజీద్ బ్రిగేడ్పై ఆంక్షలు విధించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాక్-చైనా ఉమ్మడి బిడ్ను సమర్పించాయి. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ అల్ ఖైదా, తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్, బలోచ్ ఆర్మీ, మజీద్ బ్రిగేడ్ సహా పలు ఉగ్రవాద గ్రూపులు ఆఫ్ఘనిస్థాన్ కేంద్రంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఉద్భవిస్తున్న ఉగ్రవాదం పాక్ ప్రాథమిక జాతీయ భద్రతకు ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ అభ్యర్థన మేరకు ఆ ఉగ్రసంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, పాక్-చైనా చేసిన ఈ అభ్యర్థనను యూఎస్, యూకే, ఫ్రాన్స్ అడ్డుకున్నాయి. ఈ గ్రూపులను ఉగ్ర సంస్థలుగా గుర్తించడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొన్నాయి.
















