Namaste NRI

అమెరికాలో దారుణ ఘటన…మరో తెలుగు విద్యార్థి హత్య

అమెరికా లో మరో తెలుగు విద్యార్థి హత్యకు గురయ్యాడు. 20 ఏళ్ల విద్యార్థి మృతదేహాన్ని అధికారులు సమీపం లోని అటవీ ప్రాంతంలో గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన 20 ఏళ్ల పరుచూరి అభిజిత్‌  ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ బోస్టన్‌ యూనివర్సిటీ లో ఇంజినీ రింగ్‌ చదువుతున్నాడు. అయితే అతడు క్యాంపస్‌లోని అటవీ ప్రాంతంలో శవమై కనిపించాడు. వర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థి శవమై కనిపించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు, ల్యాప్‌టాప్‌ కోసమే అభిజిత్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.

బుర్రిపాలెంకు చెందిన పరుచూరి చక్రధర్‌, శ్రీలక్ష్మి దంపతులకు అభిజిత్‌ ఒక్కగానొక్క కొడుకు. అభిజిత్‌ చిన్నతనం నుంచే చదువులో ముందుండేవాడు. విదేశాల్లో చదువుకోవాలనే అతడి నిర్ణయాన్ని మొదట్లో తల్లి శ్రీలక్ష్మి వ్యతిరేకించినప్పటికీ, కొడుకు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తన నిర్ణయం మార్చుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఉన్నత చదువుల కోసం అమెరికా పంపినట్లు చెప్పారు. తాజాగా ఒక్కగా నొక్క కొడుకు హత్యకు గురయ్యాడని తెలియగానే పరుచూరి అభిజిత్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అమెరికాలో భారత సంతతికి చెందిన విద్యార్థి మరణించడం ఈ ఏడాది (2024)లో ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం.

Social Share Spread Message

Latest News