Namaste NRI

దారుణం.. ఎన్నారై ఇంట్లో దుండగుల కాల్పులు

అమెరికా నుంచి వచ్చిన ఎన్నారైపై ఇద్దరు వ్యక్తులు అతడి ఇంట్లో కాల్పులు జరిపారు. బుల్లెట్‌ గాయాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అమెరికా నివాసి అయిన సుఖ్‌చైన్ సింగ్ అనే ఎన్నారై నెల రోజుల క్రితం సొంతూరైన డబుర్జి గ్రామానికి వచ్చాడు. హోటల్‌, లగ్జరీ కారు కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తలపాగా ధరించిన ఇద్దరు సాయుధ వ్యక్తులు బైక్‌పై సుఖ్‌చైన్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. లోనికి ప్రవేశించిన ఆ ఇద్దరు గన్‌ చూపించి అతడితో వాగ్వాదానికి దిగారు. ఇంట్లో ఉన్న పిల్లలు, అతడి తల్లి ఏమీ చేయవద్దని వారిని ప్రాథేయపడ్డారు. అయితే సుఖ్‌చైన్ సింగ్‌ను బలవంతంగా బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లేందుకు ఆ ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. అతడు ప్రతిఘటించడంతో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తల, మెడపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.

మరోవైపు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సుఖ్‌చైన్ సింగ్‌ను వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుఖ్‌చైన్ సింగ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. అత్త వారింటికి సంబంధించిన ఆస్తి వివాదం వల్ల స్థానిక గ్యాంగ్‌ సభ్యులు అతడిపై కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News