నాగార్జున ఆయన తనయుడు నాగచైతన్యతో కలిసి నటించిన చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయనా కు సీక్వెల్గా రూపొందింది. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడు. రమ్యకృష్ణ, కృతి శెట్టి కథానాయికలు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ నాన్నగారు చేసిన దసరా బుల్లోడు జనవరి 14నే విడుదలై అప్పట్లో అఖండ విజయాన్ని అందుకుంది. అలాగే ఈసారి మేము బంగార్రాజుతో బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకున్నామని తెలిపారు. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 17.5 కోట్ల వసూళ్లు సాధించింది. బంగార్రాజు సినిమా చూసి ఇంటికి రాగానే అమల మా అమ్మానాన్న ఫొటోలకు దండం పెట్టుకొని ఏడ్చింది. ఆనందంతో కూడిన కన్నీళ్లతో వాళ్లు మనల్ని చూసుకుంటున్నారు కదా అని చెప్పింది. ఈ సినిమా చూసిన వారందరూ వాళ్ల అమ్మమ్మ, తాతయ్యలను గుర్తుకు తెచ్చుకుంటున్నామని చెప్పడం ఆనందంగా ఉంది అన్నారు.
గ్రామీణ నేపథ్యంలో తాను చసిన తొలి సినిమాకు మంచి ఆదరణ దక్కడం సంతోషంగా ఉందని నాగచైతన్య చెప్పారు. ప్రేక్షకులు ఓ పండుగలా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని దర్శకుడు కల్యాణ్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్ కృష్ణ, నాగచైతన్య, అనూప్ రూబెన్స్, మలయాళ నటుడు సూర్య, జునైద్ తదితరులు పాల్గొన్నారు.














