ఒమిక్రాన్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని, ఇది ప్రతి ఇంటికి చేరుతుందని మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపక అధ్యక్షుడు బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. తన సన్నిహితులు కూడా చాలా మంది వైరస్ బారిన పడుతున్నారని తెలిపారు. ఈ ఒమిక్రాన్ మహమ్మారి వల్ల మనమంతా చెత్త దశను చూడవచ్చని అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్ నేపథ్యంలో తన హాలిడే ప్లాన్లను కూడా రద్దు చేసుకున్నామని తెలిపారు. చరిత్రలో అన్ని వైరస్ల కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని బిల్ గేట్స్ అన్నారు. ఒమిక్రాన్ మనల్ని ఎంత అనారోగ్యానికి గురిచేస్తుందనేది ఇప్పటి వరకు తెలియదని, దాని గురించి పూర్తిగా తెలిసేంత వరకు ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్కులు ధరించాలని తెలిపారు. ఎవరూ గుంపులుగా గుమికూడొద్దని సూచించారు. టీకాలు వేయించుకోవాలని వ్యాక్సిన్ బూస్టర్ డోసు మరింత రక్షణను కల్పిస్తుందని తెలిపారు. కరోనాకు వ్యాక్సిన్లు బాగా పని చేస్తున్నాయని అన్నారు. అయితే 2022 నాటికి కరోనా మహమ్మారి ముగుస్తుందని తాను నమ్ముతున్నానని తెలిపారు.














