సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు.బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితా తులా, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితర మహిళలు కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు.

మహిళలు, చిన్నారులు బోనాల పాటలకు కేరింతలు, ఉత్సాహంతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో సుమారు 900 మంది ప్రత్యక్షంగా పాల్గొనగా, ఇంటర్నెట్ ద్వారా మరో 7 వేల మంది వీక్షించారు. తెలంగాణ జానపద గేయాలు, భక్తిగీతాలు, నృత్యప్రదర్శనలు ఉత్సవానికి విశేష ఆకర్షణగా నిలిచాయి.

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైన సాంప్రదాయక పండుగ అని, తక్కువ సమయంలో పెద్ద ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఈ ఏడాది సమాజం సువర్ణోత్సవాలను కూడా ప్రకటించారు. స్పాన్సర్గా సహకరించిన వజ్ర రియల్ఎస్టేట్ వారికి అభినందనలు, వారి వ్యాపారం మరింత అభివృద్ధి కావాలని కోరుకుంటున్నామని ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు.

కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సింగపూర్ తెలుగు సమాజం, అరసకేసరి దేవస్థానం సభ్యులకు, ఆహుతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. హాజరైన ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయ అనుభూతి అందించడంలో సభ్యుల కృషి అమోఘమని కొనియాడారు.


కోశాధికారి ప్రసాద్, ఉపకోశాధికారి ప్రదీప్, ఉపాధ్యక్షులు నాగేష్, మల్లిక్, కార్యదర్శి స్వాతి, కమిటీ సభ్యులు గోపి కిషోర్, జనార్ధన్, జితేందర్, భైరి రవి, గౌరవ ఆడిటర్లు ప్రీతి, నవత,బోయిన సమ్మయ్య తదితరులు పర్యవేక్షణకు తోడ్పడ్డారు. తెలుగు వారంతా బోనాల స్ఫూర్తితో పాల్గొని మన ఐక్యతను చాటారని నిర్వాహకులు పేర్కొన్నారు.
















