సంపన్నులపై పన్నుల భారం తగిస్తానని హామీ ఇచ్చిన బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ నెల రోజులు తిరక్కముందే యూ టర్న్ తీసుకున్నారు. సంపన్నులపై భారీ పన్నులను తొలగించడానికి ఉద్దేశించిన విధానాన్ని ఉపసంహరించుకున్నారు. మార్కెట్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు తోడు ఈ విధానంపై అధికార కన్జర్వేటివ్ పార్టీ నుంచే విమర్శలు రావొచ్చన్న భయాల నేపథ్యంలోనే ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఛాన్సరల్ క్యాసీ క్వార్టెంగ్ గత నెలలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్లో అధికాదాయ వర్గాలపై 45 శాతం పన్ను వసూలు చేయడాన్ని రద్దు చేయనున్నట్లు ప్రతిపాదించారు. వచ్చే ఏప్రిల్ నుంచి ఈ నిర్ణయం అమలులోకి రావాల్సి ఉంది.
అయితే ప్రభుత్వ రుణాలు పెరగడం, డాలర్తో పోలిస్తే పౌండ్ విలువ క్షీణించడం, పింఛను చెల్లింపులకు నిధుల కొరత తదితర పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రతిపాదనను వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, పౌర సేవల్లో ప్రపంచ ప్రమాణాలు అందుకోవడానికి, వేతనాల పెరుగుదలకు, అవకాశాలు సృష్టించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదంటూ సమర్థించుకున్నారు. సంపన్నులపై అధిక పన్నుల రద్దుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని ట్రస్ చెప్పిన మారునాడే మడమ తిప్పడం చర్చనీయాంశమైంది.