లండన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్నారై టీఆర్ఎస్, టాక్ సంయుక్తంగా తెలంగాణ వేడుకలను నిర్వహించాయి. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. అభివృద్ధి సూచీలో ఎందులో చూసినా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం టాక్ ఉపాధ్యాక్షురాలు శుఘమన రెడ్డి మాట్లాడుతూ టాక్ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. మేమంతా కేవలం నేడు సంబరాలకు పరిమితం కాకుండా, నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని ఉద్యమ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో టాక్ ఉపాధ్యక్షుడు సత్య చిలుము, అడ్వైజరీ చైర్మన్ మట్టా రెడ్డి, టీఆర్ఎస్ లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి, టీఆర్ఎస్ నాయకులు మల్లా రెడ్డి, ప్రశాంత్, సురేష్ గోపతి, హరి నవాపేట్, మని తేజ, నిఖిల్, జశ్వంత్, సురేష్ బుడుగం, సత్యపాల్, శ్రావ్, సుప్రజ, స్వాతి బుడుగం, రవి రెటినేని, రవి ప్రదీప్, సృజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.














