ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన స్టార్ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నలకు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఆయన స్వయంగా విజయ్ దేవరకొండ నివాసానికి వెళ్లి నూతన వధూవరులను కలుసుకుని ఆశీర్వదించారు. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం హృదయాన్ని కదిలించింది. ఆయన ఎల్లప్పుడూ చూపే ప్రేమ, ఆప్యాయతకు మా కృతజ్ఞతలు అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులను ఈ రోజు వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశాను అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల వివాహ రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్లో ఘనంగా జరిగింది. అయితే ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండటంతో వేడుకకు హాజరు కాలేకపోయారు. అయితే ఆయన సతీమణి గీతా రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.















