ధనుష్ హీరోగా, అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్రలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం కుబేర. రష్మిక మందన్నా కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం. సునీల్ నారంగ్, రామ్మోహన్ పుస్కూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన బ్లాక్బస్టర్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడారు. నటుడిగా పరిథిని పెంచుకోవాలని రొటీన్కి భిన్నంగా నాగార్జున చేసిన ఈ ప్రయత్నం నాకు స్ఫూర్తినిచ్చింది. ఈ సినిమా తర్వాత నిజంగా ఆయన కోసం పాత్రలు పుడతాయ్. ఈ విషయంలో నాక్కూడా ప్రేరణగా నిలిచారాయన. ధనుష్ నిజంగా పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఈ పాత్రను ఆయన తప్ప మరొకరు చేయలేరు. ఈ సినిమాతో తప్పకుండా ధనుష్ కు నేషనల్ అవార్డు రావాలి. శేఖర్ కమ్ముల తీసిన సినిమాలు తక్కువే అయినా, అన్నీ ఆణిముత్యాలే. ఆయన సినిమాల్లో ఆర్టిస్టులు కనిపించరు. పాత్రలే కనిపిస్తాయి. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. ఈ సినిమా మరింత విజయాన్ని సాధించి, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాలి అని చిరంజీవి ఆకాంక్షించారు.

థ్రిల్లర్ తీసి సోషల్ మెసేజ్ ఇవ్వడం శేఖర్ కమ్ములకే చెల్లింది. నటుడిగా నాలో మార్పు తెచ్చిందీ సినిమా. ఇక వెరైటీ పాత్రలు నన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఇంకో 40ఏండ్లు నటుడిగా కొనసాగే స్ఫూర్తినిచ్చిందీ సినిమా. ఇక ధనుష్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ సినిమా అందరికీ నచ్చడం అరుదు. అందుకే కుబేర ఓ మిరాకిల్ అని అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. ధనుష్ మాట్లాడుతూ భారీతనం కాదు, భావోద్వేగాలే ఆడియన్స్ని థియేటర్లకు రప్పిస్తాయని నిరూపించిన సినిమా కుబేర అన్నారు. ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాను. ఫస్ట్ షోతోనే ఆ కష్టాన్నంత మరిచిపోయేంత ఆనందాన్ని ఆడియన్స్ నాకిచ్చారు అని శేఖర్కమ్ముల సంతోషం వెలిబుచ్చారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.
