అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ఆపే విషయంలో రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ వెల్లడించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, రష్యా నుంచి చమురు , యురేనియం కొనుగోలు చేసే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై 500 శాతం వరకూ సుంకాలు విధించనున్నారు. ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగనున్నట్లు లిండ్సే గ్రాహమ్ తెలిపారు.

రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తూ ఉక్రెయిన్తో యుద్ధానికి నిధులు సమకూరుస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన కీలక సమావేశం అనంతరం లిండ్సే గ్రాహమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. గత కొన్ని నెలలుగా డెమోక్రాట్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెన్థాల్తో కలిసి తాను పనిచేస్తున్న రష్యా ఆంక్షల బిల్లుకు ట్రంప్ అనుమతి ఇచ్చారని ఆయన చెప్పారు. ఉక్రెయిన్ శాంతి చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ బిల్లు తీసుకురావడం వ్యూహాత్మకంగా సరైన సమయమని గ్రాహమ్ అభిప్రాయపడ్డారు.















