Namaste NRI

మ‌రో వివాదానికి తెర‌లేపిన డొనాల్డ్‌ ట్రంప్ 

ప్ర‌తీకార సుంకాల‌తో చైనాపై అమెరికా  విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. డొనాల్డ్‌ ట్రంప్‌  క‌క్ష‌పూరిత‌మైన చ‌ర్య‌ల‌ను గ‌ట్టిగానే వ్య‌తిరేకించిన బీజింగ్ ప్ర‌భుత్వం ముల్లును ముళ్లుతోనే తీయాల‌నే చందంగా  యూఎస్ దిగుమ‌తుల‌పై అదే స్థాయిలో సుంకాలు విధించి, అమెరికా ప్రెసిడెంట్‌కు దిమ్మ‌దిరిగే స‌మాధానం ఇచ్చింది. ఆ త‌ర్వాత నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య రెండు దేశాలు ప్ర‌తీకార సుంకాల‌పై ఓ అంగీక‌రానికి వ‌చ్చాయి. దీంతో చైనా, అమెరికా మ‌ధ్య వైరం స‌మ‌సిపోయింది అనుకునే లోపే తాజాగా మ‌రో వివాదానికి ట్రంప్ ప్ర‌భుత్వం తెర‌లేపింది.

విదేశీ విద్యార్థుల వీసాల‌ను అమెరికా  త‌గ్గిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ దేశానికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు చేసేవారి వీసాల‌ను కూడా ర‌ద్దు చేసే ప్ర‌ణాళిక‌ల‌ను అమెరికా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. తాజాగా చైనీస్ విద్యార్థుల వీసాల‌పై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్ట‌నున్న‌ట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. చైనీస్ క‌మ్యూనిస్టు పార్టీతో లింకున్న విద్యార్థుల వీసాల‌ను, క్లిష్ట‌మైన రంగాల్లో విద్య‌ను అభ్య‌సిస్తున్న విద్యార్థుల వీసాల‌ను కూడా ర‌ద్దు చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

చైనా నుంచి ఎక్కువ సంఖ్య‌లో విద్యార్థులు ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికా వెళ్తుంటారు. అమెరికాలో చ‌దువుతున్న‌ అంత‌ర్జాతీయ విద్యార్థుల్లో చైనీయులు రెండో స్థానంలో ఉన్నారు. తొలి స్థానంలో భార‌తీయ విద్యార్థులు ఉన్నారు. 2023-2024 సంవ‌త్స‌రంలో చైనా నుంచి 2 ల‌క్ష‌ల 70 వేల మంది విద్యార్థులు అమెరికా చ‌దువుల‌కు వెళ్లారు. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో నాలుగోవంతు చైనీయులే ఉన్నారు.

Social Share Spread Message

Latest News