
గత కొన్ని దశాబ్దాలుగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక తనపై అసత్య ప్రచారాలని వ్యాప్తి చేస్తోందని ఆరోపిస్తూ ఆ పత్రికపై 15 బిలియన్ డాలర్ల (రూ.1.32 లక్షల కోట్ల) కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావా వేశారు. ఈ పత్రికతోపాటు ఆ పత్రిక జర్నలిస్టులు నలుగురిపై ఫ్లోరిడా లోని యుఎస్ డిస్ట్రిక్టు కోర్టులో దావా దాఖలైంది. తనపై అనేక కథనాలు వ్యతిరేకంగా ప్రచురించారని, దాంతోపాటు ఒక పుస్తకాన్ని కూడా ఆ పత్రిక జర్నలిస్టులు ఇద్దరు రచించి 2024 ఎన్నికల వరకు ప్రచురించారని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ పరువుకు నష్టం కలిగేలా దురుద్దేశ్యపూర్వకంగా ఇవన్నీ ప్రచురించారని దావాలో పేర్కొన్నారు. అయితే దీనిపై న్యూయార్క్ టైమ్స్ ఇంతవరకు స్పందించలేదు.
















