
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ పార్టీ కార్యకర్త చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. ఉటా రాష్ట్రంలోని ఉటా వేలీ యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమంలో ఆయనను ఒక దుండగుడు కాల్చి చంపాడు. మాస్ షూటింగ్పై జరిపిన చర్చా కార్యక్రమంలోనే ఆయనను కాల్చి చంపారు. సమీప భవనం పై కప్పు నుంచి జరిపిన ఒక రౌండ్ కాల్పుల్లో చార్లీ మెడపై తీవ్ర గాయం కావడంతో ఆయనను దవాఖానకు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మరణించారు. గుర్తు తెలియని ఆ షూటర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే ఈ ఘటనతో వారికెలాంటి సంబంధం లేదని తెలియడంతో తర్వాత వదిలేసినట్టు ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు. కాగా, చార్లీ హంతకుడిగా భావిస్తున్న ఒక చిత్రాన్ని ఎఫ్బీఐ విడుదల చేసింది. అతడిని పట్టిచ్చిన వారికి లక్ష డాలర్లు బహుమతి ఇస్తామని ప్రకటించింది.
















